రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు రవితేజ. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారాయన. తాను సోషల్ మీడియాను ఎక్కువగా వాడనని తెలిపారు. అయితే అభిమానుల్లో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఫోటోలు, కంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేయాలని తన పిల్లలు సలహా ఇస్తుంటారని మాస్ మహారాజా వెల్లడించారు. అయితే తాను పిల్లల సూచనలను అరుదుగా పాటిస్తానని రవితేజ అన్నారు.
ప్రస్తుతమున్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రమోషన్ అవసరమని రవితేజ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను వాటి గురించి ఆందోళన చెందకుండా.. తనకు నచ్చినవి మాత్రమే పోస్ట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. కాగా.. ఇరుముడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.


