
కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు లారెన్స్. దివ్యాంగులకు ఎప్పటి నుంచో సేవ చేస్తున్న ఇతడు.. అప్పుడప్పుడు ఆపదలో ఉన్నవాళ్లని కూడ ఆదుకుంటూ ఉంటాడు. తాజాగా అలానే తమిళనాడుకి చెందిన ఓ మహిళకు ఆర్థిక సాయం చేసి మనసులు గెలిచేశాడు.
విషయానికొస్తే.. శివగంగై జిల్లా తిరుప్పువనానికి చెందిన కుమార్, అతని భార్య ముత్తుకరుప్పి కూలీ పనులు చేసి డబ్బుని పొదుపు చేసుకున్నారు. ఆ మొత్తాన్ని హుండీలో దాచి, దానిని గొయ్యి తవ్వి పాతి పెట్టారు. కొన్నిరోజుల ముందు లెక్కించగా రూ.లక్ష ఉన్నట్లు తెలిసింది. తాజాగా మరోసారి తీసి చూడగా డబ్బులన్నీ చెదలు పట్టేశాయి. రూ.500 నోట్లని కొంతమేర తినేశాయి. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు.
(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్)
సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కొరియోగ్రాఫర్ లారెన్స్.. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. పోగొట్టుకున్న రూ.లక్షని వారికి అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. లారెన్స్ కి ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ ముత్తుకరుప్పి కుటుంబానికి మాత్రం ఇది చాలా పెద్ద సాయమే.
ప్రస్తుతం బెంజ్ అనే సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తనకు తోచిన సాయం చేసిన ఓ కుటుంబానికి అండగా నిలిచాడు.
(ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాత కూతురి పెళ్లి.. 15 వేలమంది గెస్టులు)