చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ రెడీ అయింది. ఇంతకుముందు తమిళ సినిమాల్లో వరసగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు సహా తదితర భాషల్లో నటిస్తోంది. అలా లేటెస్ట్గా 'ఇరుముడి' చేసింది. ఈ శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా నటించగా శివ నిర్వాణ దర్శకుడు.
'ఇరుముడి'లో నటించిన అనుభవాన్ని పంచుకున్న ప్రియా భవానీ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తయినా సరే అందులోని పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి పాత్రని నేను ఇందులో చేశా. అమ్మగా కావేరీ అనే పాత్రలో నటించాను. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. స్టోరీ విన్నప్పుడు దర్శకుడు శివ నిర్వాణ క్రియేట్ చేసిన లోకాన్ని అర్థం చేసుకున్నాను. ఇలాంటి నిజాయితీ, బలమైన పాత్రలో నటించడం చాలా సంతోషం అనిపించింది'
'ఇరుముడి సినిమాలో అనుబంధాలు, ఎంతో ప్రేమ, భావోద్వేగాలతో కూడిన మూమెంట్స్ ఉన్నాయి. ఇందులోని కావేరి పాత్ర నాకు చాలా స్పెషల్. రవితేజతో కలిసి నటించడం మంచి అనుభవం. ఆయన అందరితోనూ చాలా ప్రేమగా, సహజంగా మసలుకుంటారు. సినిమా కాకుండా చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. ఇరుముడి చాలా మంచి అనుభవం' అని ప్రియా భవానీ శంకర్ చెప్పుకొచ్చింది.


