'మగవాడు 4 పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదు..కానీ'..

Not Four, I Will Get Married 40 Times Says Actress Vanitha Vijayakumar - Sakshi

Vanitha Vijayakumar: వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్‌ ఇటీవలె తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. సీనియర్‌ యాక్టర్స్‌ విజయ్‌-మంజుల కూతురే వనిత. 'చంద్రలేఖ' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని తరచూ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకొని విమర్శలపాలైంది. వీరి వివాహం  సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ఆ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు.

వివాహం అయిన కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అలా మూడో పెళ్లి పెటాకులైన వనితా విజయ్‌ తాజాగా పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌తో పెళ్లి ఫోటో షేర్‌ చేసి అందరికి షాకిచ్చింది. ఇద్దరూ పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ లవ్‌ సింబల్‌ను జోడించింది. దీంతో వనితా విజయ్‌కుమార్‌ నాలుగో పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఓ  జ్యోతిష్యుడు వనితాకు నాలుగో పెళ్లి జరుగుతుందంటూ చెప్పిందే నిజమైందంటూ జోకులు పేల్చారు.

ఇక వీరిద్దరరి పెళ్లి ఫోటో నెట్టింట ఎంతగా వైరల​ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కరల్లేదు. దీంతో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చిన వనితా విజయ్‌కుమార్‌ స్పందించింది. ఇది నిజమైన పెళ్లి కాదని,  ‘పికప్‌ డ్రాప్‌’ అనే చిత్రానికి సంబంధించిన ఫొటోలని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా పెళ్లి గురించి తనపై వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.. 'ఇద్దరు నటీనటులు కలిసి ఫోటోలు తీసుకుంటే అది నిజమైన పెళ్లి అయిపోతుందా? దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? నా స్థానంలో ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని ఒక మహిళ చేస్తే మాత్రం తప్పుపడుతున్నారు. నాలుగు కాదు..40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం. అయినా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని స్పష్టం చేసింది. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top