ఫ్రైడే సందడి | New movies hitting theatres on November 21: Tollywood | Sakshi
Sakshi News home page

ఫ్రైడే సందడి

Nov 19 2025 3:28 AM | Updated on Nov 19 2025 3:28 AM

New movies hitting theatres on November 21: Tollywood

సినిమా లవర్స్‌కి ఈ ఫ్రైడే  జోష్‌ డే. ఎందుకంటే ఒకటి కాదు... రెండు కాదు... డజను సినిమాల వరకూ విడుదల కానున్నాయి. యాక్షన్‌ మావీస్, కామెడీ ఎంటర్‌టైనర్స్, ఫ్యామిలీ స్టోరీస్‌... ఇలా అన్ని రకాల సినిమాలూ వెండితెరపైకి రావడానికి రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం... చూసేయడానికి రెడీ అయిపోండి. ఈ లోపు శుక్రవారం విడుదల కానున్న సినిమాలపై ఓ లుక్కేయండి.

గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌ 
ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని అందించడంతో  పాటు.. అప్పుడప్పుడూ వారిని భయపెడుతుంటారు ‘అల్లరి’ నరేశ్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. కామాక్షీ భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాల ఫేమ్‌ దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ ఈ సినిమాకు కథ, స్క్రీన్  ప్లే, డైలాగ్స్‌ అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వైవా’ హర్ష, ‘గెటప్‌’ శ్రీను, సద్దాం, జీవన్  కుమార్, గగన్  విహారి, అనిష్‌ కురువిల్లా, మధుమణి ఇతర పాత్రలు పోషించారు.

పవన్ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్  పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘‘మంచి గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ఆత్మలు కొందరికే ఎందుకు కనిపిస్తాయి? అందరికీ ఎందుకు కనపడవు? వంటి అంశాలతోనూ రూపొందిన ఈ చిత్రంలో తర్వాత ఏం జరగబోతుందనే ఎగ్జయిట్‌మెంట్‌ ఆడియన్స్ లో ఉంటుంది.

ఈ సినిమాలో నరేశ్‌గారి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయనకు జోడీగా ఆరాధన అనే పాత్రలో కామాక్షీ భాస్కర్ల నటించారు. కథలో ఆమె పాత్రకి చాలాప్రాధాన్యం ఉంటుంది. భీమ్స్‌గారి సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

క్రైమ్‌ కామెడీ  
లవర్‌బోయ్‌గా యూత్‌ ఆడియన్స్‌లో తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్‌ తరుణ్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాంచ్‌ మినార్‌’. రామ్‌ కడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించారు. అజయ్‌ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్‌ రెడ్డి, నితిన్‌ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. గోవింద రాజు సమర్పణలో కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్‌పీపై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ‘‘క్రైౖమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘పాంచ్‌ మినార్‌’.

ఈ టైటిల్, ఫస్ట్‌ లుక్, టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఉద్యోగం లేని ఓ కుర్రాడు కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. అప్పుడు తనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ప్రత్యేకించి రాజ్‌ తరుణ్‌ పాత్ర ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో నవ్వులు పూయిస్తుంది. ఈ చిత్రం క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందినప్పటికీ ఆడియన్స్‌ మరీ భయపడేంత వయొలెంట్‌గా ఉండదు. కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటారు. శేఖర్‌ చంద్ర సంగీతం, ఆదిత్య జవ్వాది      విజువల్స్‌ మా సినిమాకి అదనపు బలాలు’’ అని ఈ సందర్భంగా మేకర్స్‌ తెలిపారు.


ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 
యాక్షన్‌ కింగ్‌గా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు అర్జున్‌ సర్జా. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మఫ్టీ పోలీస్‌’. దినేష్‌ లక్ష్మణన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటించారు. రామ్‌ కుమార్‌ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్‌ రాజా ముఖ్య పాత్రల్లో నటించారు. జియస్సార్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై జి. అరుల్‌ కుమార్‌ నిర్మించిన ‘తీయవర్‌ కులై నడుంగ’ సినిమా తమిళంలో విజయవంతం అయింది.

ఈ సినిమాని శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై నిర్మాత ఎ.ఎన్‌. బాలాజీ తెలుగులో ఈ నెల 21న రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘ఒక రచయిత హత్య నేపథ్యంలో సాగే పోలీస్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో చిత్రం ‘మఫ్టీ పోలీస్‌’. ఇటీవలి కాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి (మానసిక ఎదుగుదల) గురించి కూడా మా సినిమాలో చర్చించాం. ఈ చిత్రంలో అర్జున్‌ యాక్షన్, పర్సనల్‌ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

అర్జున్, ఐశ్వర్యా రాజేష్‌లకు తెలుగునాట ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘మఫ్టీ పోలీస్‌’ చిత్రాన్ని తెలుగులోనూ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. శరవణన్‌ అభిమన్యు సంగీతం, భరత్‌ ఆశీనగన్‌ విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. తమిళంలో విజయం సాధించినట్లే తెలుగులోనూ ‘మఫ్టీ పోలీస్‌’ అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఎ.ఎన్‌. బాలాజీ తెలిపారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియదర్శి హీరోగా నటించిన మరో వినోదాత్మక చిత్రం ‘ప్రేమంటే’. ఈ సినిమా ద్వారా నవనీత్‌ శ్రీరామ్‌ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఈ మూవీలో ఆనంది హీరోయిన్‌గా నటించగా, యాంకర్‌ సుమ కనకాల ముఖ్యమైన పాత్ర పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ఎస్‌వీసీ ఎల్‌ఎల్‌పీ, స్పిరిట్‌ మీడియా బ్యానర్స్‌పై పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు, జాన్వీ నారంగ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్‌ ముందుకొస్తోంది.

‘‘రిఫ్రెషింగ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ప్రేమంటే’. కొత్తగా పెళ్లయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదాలు, సంతోషాలు, వినోదం, భావోద్వేగాలను బ్యాలెన్స్  చేస్తూ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్‌ నవనీత్‌ శ్రీరామ్‌. కానిస్టేబుల్‌ క్యారెక్టర్‌లో సుమ కనకాల తన సిగ్నేచర్‌ మార్క్‌తో అలరిస్తారు. ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది.

విశ్వనాథ్‌ రెడ్డి లైవ్లీ విజువల్స్‌ అందించారు. లియాన్‌ జేమ్స్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ స్కోర్‌  ఫన్‌ని మరింత ఎలివేట్‌ చేసింది. ఎడిటర్‌ రాఘవేంద్ర తిరున్,ప్రొడక్షన్‌ డిజైనర్‌ అరవింద్‌ మూలే, డైలాగ్‌ రైటర్స్‌ కార్తిక్‌ తుపురాణి, రాజ్‌కుమార్‌ అందరూ ది బెస్ట్‌ వర్క్‌ ఇచ్చారు.ప్రొడక్షన్‌ వాల్యూస్‌ టాప్‌ క్లాస్‌లో ఉన్నాయి. ట్రైలర్‌ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

వాస్తవ ఘటనలతో... 
అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్, మాన్‌ సూన్స్  టేల్స్‌ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ‘‘2004లో పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో రూపొందిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.

ఇది పరువు హత్యకు సంబంధించిన కథ అయినప్పటికీ ఫిక్షనల్‌ యాడ్‌ చేసి, తెరకెక్కించాం. ఈ కథలో ప్రేమికులకు ఏం జరిగింది అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఈ మూవీ కథ. చాలా ఇంటెన్స్  స్టోరీ ఇది. ప్రత్యేకించి ఈ సినిమా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అఖిల్, తేజస్విని అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూశాక నిజంగా ప్రేమించుకున్న వాళ్లు తమ ప్రేమ కోసం ఎంతవరకు వెళ్తారు? అనేది ప్రేక్షకులు తెలుసుకుంటారు. సురేష్‌ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ’’ అని చిత్రబృందం తెలిపింది.

వృక్షో రక్షతి రక్షితః 
రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, నాగదుర్గ, మహేంద్ర నాథ్, సతీష్‌ శ్రీ చరణ్, అశోక్‌ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కలివి వనం’. రాజ్‌ నరేంద్ర దర్శకత్వం వహించారు. ఏఆర్‌ప్రొడక్షన్స్ పై మల్లికార్జున్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్‌ అవుతోంది. ‘‘వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన అరుదైన సినిమా ‘కలివి వనం’. వర్షం ఆకాశం నుంచి వస్తుందని పిల్లలకు చెబుతాం.

కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచి పిల్లలు తెలుసుకుంటారు. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, తన 70 ఎకరాల సొంత భూమిలో మొక్కలు నాటి అడవిగా మార్చిన దుష్చర్ల సత్యనారాయణగార్ల స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. ‘కలివి వనం’ పిల్లల జీవిత శైలిలో ఒక పాఠ్య భాగంలాగా, పెద్దబాల శిక్షలో ఒక పేజీలాగా వాళ్ల మైండ్‌లో ఉండిపోతుంది. ఇలాంటి సినిమాని పిల్లలు తప్పకుండా చూడాలి. మదీన్‌ ఎస్‌.కె. సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 
త్రినాథ్‌ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్‌ ఇతర పాత్రలు పోషించారు. సంజీవనిప్రొడక్షన్స్  బ్యానర్‌పై బళ్లారి శంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘పూర్తిస్థాయి వినోదాత్మకంగా, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’.

మా సినిమాకి కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ సినిమా 100శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది. మా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి కుర్రాడు తమని తాము హీరో పాత్రలో ఊహించుకుంటారు. ఆర్పీ పట్నాయక్‌గారి సంగీతం మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. జగదీష్‌ చీకటివిజువల్స్‌ ఆకట్టుకుంటాయి’’ అన్నారు మేకర్స్‌.

చెన్నై నేపథ్యంలో... 
‘డాడా’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కెవిన్  హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్క్‌’. దర్శకుడు వెట్రిమారన్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్  అశోక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘తడాఖా, సైంధవ్‌’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆండ్రియా జెరెమియా ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించారు. రుహానీ శర్మ, చార్లీ, రమేష్‌ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్‌ ముందుకొస్తోంది.

‘‘పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్‌ కామెడీ చిత్రం ‘మాస్క్‌’. ఆండ్రియా తమిళంలో అటు హీరోయిన్‌గా, ఇటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో నెగటివ్‌ రోల్‌లో కనిపించడంతో పాటు నిర్మించడం విశేషం. కెవిన్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది.      జి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం, నేపథ్య సంగీతం, ఆర్‌డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం ఈ సినిమాని మరో ఎత్తుకు తీసుకెళతాయి. మా మూవీ టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

నిజ జీవిత కథతో....
కేథలిక్‌ మత సోదరి, సామాజిక కార్యకర్త, సీనియర్‌ రాణి మరియా వట్టాలిల్‌ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన మలయాళ చిత్రం ‘ది ఫేస్‌ ఆఫ్‌ ది ఫేస్‌లెస్‌’. విన్సీ అలోషియస్‌ లీడ్‌ రోల్‌లో నటించారు. షైసన్‌ పి.ఔసేఫ్‌ దర్శకత్వం వహించారు. ట్రై లైట్‌ క్రియేషన్స్ పై సాండ్రా డిసౌజా రాణా నిర్మించిన ఈ సినిమా మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు.. 2024 ఆస్కార్‌కి నామినేట్‌ అయింది కూడా. ఈ మూవీని దివ్యవాణి సోషల్‌ కమ్యూనికేషన్స్  ద్వారా ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు.

‘‘సీనియర్‌ రాణి మరియా వట్టాలిల్‌ నిజ జీవిత కథ ఆధారంగా ‘ది ఫేస్‌ ఆఫ్‌ ది ఫేస్‌లెస్‌’ రూపొందిందింది. ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేశారు. అదేవిధంగా అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారామె. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను కూడా మా సినిమాలో చూపిస్తున్నాం. క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా తెలుగు వారికి కూడా నచ్చుతుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.

వినోదాల ప్రయాణం 
హరిప్రసాద్‌ కోనే, ఇషాని గోష్‌ జంటగా నటించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్‌ కొండ నిర్మించారు. దువ్వాసి మోహన్, సంజయ్‌ రాయచూర, ఆనంద్‌ భారతి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ‘‘వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఆలోచింపజే సేలా ఈ సినిమా ఉంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేతులమీదుగా విడుదల చేసిన మా సినిమా ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేయడానికి అంగీకరించాను. ఇలాంటి సినిమా చేసిన చైతన్య కొండాని అభినందిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, దానిమీద సామాజిక బాధ్యత ఉన్న డైరెక్టర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయం. హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను సహకరిస్తాను’ అంటూ బండి సంజయ్‌గారు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. చైతన్య రాజ్‌ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అరుణ్‌ కుమార్‌ విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి’’ అంటూ దర్శక– నిర్మాతలు తెలిపారు.

జనతా బార్‌లో... 
రాయ్‌ లక్ష్మీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘జనతా బార్‌’. బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. అశ్వథ్‌ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్‌ పతాకపంపై రమణ మొగిలి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. ‘‘కుస్తీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జనతా బార్‌’. మహిళలప్రాధాన్యతను చాటి చెప్పే కథగా ఈ మూవీ ఉంటుంది.

బార్‌ గర్ల్‌గా తన ప్రయాణం మొదలు పెట్టిన ఓ అమ్మాయి కుస్తీ పోటీల్లో ఎలా రాణించింది? ఈ ప్రయాణంలో సమాజం నుంచి ఆమె ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంది? వంటి అంశాలతో మా సినిమా సరికొత్తగా ఉండబోతోంది. అలాగే ఈ మంచి సందేశం కూడా ఉంది. హీరో శ్రీకాంత్‌ చేతులమీదుగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఓ రకంగా ఈ సినిమా రాయ్‌ లక్ష్మీకి తెలుగులో హీరోయిన్ గా రీ ఎంట్రీలాంటిది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ‘జనతా బార్‌’ ఎలాంటి ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేయకపోవడంతో విడుదల వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  

ప్రేమలో రెండోసారి
రమణ సాకే, వనిత గౌడ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. సత్య మార్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘జబర్దస్త్‌’ శ్రీను, ‘జబర్దస్త్‌’ ఫణి, బాబీ, రాణి ఇతర పాత్రలు పోషించారు. సాకే రామయ్య సమర్పణలో సిద్ధ క్రియేషన్‌ బ్యానర్‌లో సాకే నీరజ లక్ష్మి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ‘‘ప్రేమ నేపథ్యంలో తీసిన సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. అదే నేపథ్యంలో రూపొందిన మా సినిమా కథ కూడా నేటి యువతీ యువకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది. ప్రస్తుత ట్రెండ్‌కి తగట్టు సత్య మార్కగారు ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రేమతో పాటు భావోద్వేగాలు, సెంటిమెంట్‌ వంటి అంశాలు  అలరిస్తాయి. మా చిత్ర సంగీతం, నేపథ్య సంగీతం మనసును హత్తుకునేలా ఉంటాయి’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement