
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం కోస్టావో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ను అడ్డుకున్న కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెజ్ జీవితం ఆధారంగా దర్శకుడు సేజల్ షా రూపొందించారు. ఇటీవలే ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజైంది. తన మూవీ రిలీజ్ తర్వాత నవాజుద్దీన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ప్రస్తుత స్థితి గురించి మాట్లాడారు. హిందీలో ఇతరుల సినిమాలను కాపీ కొట్టడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
బాలీవుడ్ గురించి నవాజ్ మాట్లాడుతూ, "మన పరిశ్రమలో ఐదేళ్లుగా ఇదే పునరావృతం అవుతోంది. అందుకే ప్రేక్షకులు విసుగు చెంది చివరకు విడిచిపెట్టారు. వాస్తవానికి బాలీవుడ్లో అభద్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అంతా ఓకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఒకటి హిట్ అయితే చాలు. ఇక దానికే 2,3,4 అంటూ సీక్వెల్స్ తీసుకుంటూ పోతారు. బ్యాంకుల్లో జరిగే ఆర్థిక దివాలా లాగే.. ఇది కూడా క్రియేటివ్ దివాలా. బాలీవుడ్లో క్రియేటివిటీ లోపించింది. ఇప్పుడే కాదు.. ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో కాపీ కొడుతూనే ఉన్నారు. కథలు , పాటలు ఇతర ఇండస్ట్రీల నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నారు' అని కాస్తా ఘాటుగానే విమర్శించారు.
సౌత్ నుంచి కాపీ చేయడంపై మాట్లాడుతూ..'ఇక్కడ ఉండే దొంగలు ఎలా సృజనాత్మకంగా ఉంటారు? మనం దక్షిణాది నుంచి, కొన్నిసార్లు ఇతర ఇండస్ట్రీల నుంచి కథలు దొంగిలించాం. హిట్లుగా మారిన కొన్ని కల్ట్ సినిమాల్లో కూడా కాపీ చేసిన సన్నివేశాలు ఉంటాయి. గతంలో వారు ఒక వీడియోను అందజేసి ఇది మేము తీయాలనుకుంటున్న సినిమా అని చెప్పేవారు. దానిని చూసి ఇక్కడ దానిని రిపీట్ చేసేవారు. ఇలాంటి పరిశ్రమ నుంచి మనం ఏమి ఆశించవచ్చు? ఎలాంటి నటులు వస్తారు? అంతా ఓకే రకమైనవారు అవుతారు. అందుకే నటులు, దర్శకులు తప్పుకోవడం ప్రారంభించారు - అనురాగ్ కశ్యప్ లాంటి మంచి కథలు అందించేవారు కూడా తప్పుకుంటున్నారు' అని తెలిపారు.