'రామాయణ' సినిమా కోసం నిర్మాతగా స్టార్‌ హీరో.. అధికారిక ప్రకటన | Namit Malhotra And Dash Produce Ramayana Movie | Sakshi
Sakshi News home page

'రామాయణ' సినిమా కోసం నిర్మాతగా స్టార్‌ హీరో.. అధికారిక ప్రకటన

Apr 12 2024 3:40 PM | Updated on Apr 12 2024 4:07 PM

Namit Malhotra And Dash Produce Ramayana Movie - Sakshi

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

దంగల్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ అధికారికంగా వచ్చేసింది. రాకింగ్ స్టార్ యశ్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి 'రామాయణ' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది.

నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. 'US, UK, ఇండియా వంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు కూడా వెళ్లాను. నా జీవితంలో నేను చేసిన జర్నీ ప్రకారం ఇప్పుడు నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలను అని అనిపిస్తుంది. ఎక్కడో కర్ణాటక నుంచి ఈరోజు ప్రపంచం గర్వించే KGF 2 వరుకు, యశ్‌ చాలా కష్టపడ్డాడు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌ను ప్రపంచ వేదిక మీద ప్రెసెంట్ చెయ్యాలి అంటే అది యశ్‌ లాంటి వారితోనే సాధ్యమవుతుంది.' అని ఆయన అన్నారు.

యశ్‌ మాట్లాడుతూ... ' నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, అందుకు రామాయణ సినిమానే కరెక్ట్‌ అనుకున్నాను. ఈ విషయంపై నమిత్‌తో నేను అనేక మార్లు చర్చించాను. కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మాములు విషయం కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.' అని తెలిపారు.

నమిత్ మల్హోత్రా యాజమాన్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో గ్లోబల్ కంటెంట్‌ను సినిమా చిత్రీకరించే ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ మూడు సినిమాల నిర్మాణంలో భాగమై ఉంది. అందులో రామాయణం కూడా ఒకటి. యశ్‌కు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్‌పై ‘టాక్సిక్‌’ చిత్రాన్ని  కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్‌ చేతులు కలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement