లూసిఫర్‌2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్‌ | L2 Empuraan Movie 2 Days Collections | Sakshi
Sakshi News home page

లూసిఫర్‌2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్‌

Mar 29 2025 9:58 AM | Updated on Mar 29 2025 10:31 AM

L2 Empuraan Movie 2 Days Collections

మలయాళ సినిమా 'లూసిఫర్‌2: ఎంపురాన్‌' (L2 Empuraan) బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, తాజాగా ఈ సినిమా రెండు రోజుల్లోనే బెంచ్‌మార్క్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు మోహన్‌లాల్‌ ప్రకటించారు.  2019లో వచ్చిన లూసిఫర్‌ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌  నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో లూసిఫర్‌2 చిత్రాన్ని నిర్మించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని  స్టార్‌ హీరో  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించారు.

లూసిఫర్‌2 కేవలం రెండురోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్లు మోహన్‌లాల్‌ ఒక పోస్టర్‌తో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 48 గంటల్లోపు రూ. 100 కోట్లను అధిగమించి, సినిమా చరిత్రలోనే కొత్త రికార్డ్‌ను లూసిఫర్‌ నెలకొల్పిందని మోహన్‌లాల్‌ అన్నారు. ఈ  విజయంలో భాగమైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని ఒక పోస్ట్‌ చేశారు.

మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. అయితే, ఎంపురాన్‌ 48 గంటల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఈ సినిమా ఫైనల్‌గా రూ. 200 కోట్లు దాటొచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా 2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. అప్పట్లో లూసిఫర్‌ సినిమానే మొదటిసారి ఈ మార్క్‌ను దాటి   రూ.127 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్‌ బాయ్స్‌ రూ.242 కోట్లతో  ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్‌ బ్రేక్‌ చేస్తుంది అని మోహన్‌లాల్‌ అభిమానులు అంటున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement