మలయాళ స్టార్ హీరోలపై నటి పార్వతి తిరువోతు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను ప్రజలు దేవుళ్లలా పూజించడం వల్లే వారి తప్పులను ఎత్తి చూపడం కష్టంగా మారుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు జంటగా నటించిన తాజా చిత్రం ‘ఐనోబడీ’. నిస్సాం బషీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 9న, తెలుగులో 10న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పార్వతి.. మలయాళ చిత్రపరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘గడచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో మలయాళ ఇండస్ట్రీలో కొన్ని మార్పులు వచ్చిన మాట నిజమే. కానీ అవన్నీ మనస్ఫూర్తిగా వచ్చినవి కాదు. ప్రజలను నుంచి వచ్చిన విమర్శలు, మీడియా వల్ల ఈ మార్పులు జరిగాయి. ఇప్పటికీ ఇక్కడ స్టార్ హీరోలకు వీరపూజ సంస్కృతి కొనసాగుతుంది. స్టార్ హీరోలను దేవుళ్లలా పూజిస్తున్నారు. అందుకే వారి తప్పులను ప్రశ్నించడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి వాతావరణం ఉండటం వల్లే ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, కొత్తగా వచ్చే వారిపై తమ అధికారాన్ని చాలా సులభంగా చెలాయిస్తున్నారు’అని పార్వతి అన్నారు. ఇండస్ట్రీలో మహిళల హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని పార్వతి స్పష్టం చేశారు.


