సినిమాల వల్ల నిర్మాతలకు లాభమా? నష్టమా? అన్న ప్రశ్నకు రకరకాల బదులు వస్తుంది. ఒక పక్క చిత్ర పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో నెట్టబడుతోంది అనే వేదన వినిపిస్తోంది. మరో పక్క కోట్లు కొల్లగొడుతున్నాయి అనే ప్రచారాన్ని ఊదరగొడుతుండం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా కొత్త నిర్మాతలు వస్తూనే ఉన్నారు. చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల స్టార్ హీరో హీరోయిన్ల చిత్రాలు లాభాల్లో షేర్ విధానంలో నటించాలనే డిమాండ్ నిర్మాతల మండలి నుంచి పెరుగుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించి ఏడాదిన్నర అవుతోంది. గతేడాది వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తర్వాత మరో చిత్రం ప్రారంభం కాలేదు. ఆయన 64వ చిత్రానికి దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథను సిద్ధం చేసి చాలా నెలలే అయ్యింది. త్వరలోనే చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాత ఎవరన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది.
అయితే సమస్య అంతా అజిత్ రెమ్యునరేషన్తో అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అజిత్ రూ.180 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత పారితోషికం ఇస్తే చిత్రం వర్కౌట్ కాదని రోమియో పిక్చర్స్ అధినేత రాహుల్.. అజిత్ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే ఆయన విజ్ఞప్తిని అజిత్ నిరాకరించారన్న టాక్ కోలీవుడ్లో వైరల్గా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో నటుడు అజిత్ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ప్రచారం జోరందుకుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం అజిత్ కుమార్ కారు రేసులతో బిజీగా ఉన్నారు. రేస్ పూర్తయ్యాక చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత అజిత్ కొత్తగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి స్వీయ నిర్మాణంలో చిత్రం చేయనున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది. మరి అజిత్ నిర్మాతగా మారతాడా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


