అప్పుడేం జరిగిందో యువతకు తెలియాలి | Kangana Ranaut launches Hindi trailer of Razakar movie | Sakshi
Sakshi News home page

అప్పుడేం జరిగిందో యువతకు తెలియాలి 

Feb 11 2024 1:19 AM | Updated on Feb 11 2024 1:19 AM

Kangana Ranaut launches Hindi trailer of Razakar movie - Sakshi

మకరంద్, అనుష్యా, రాజ్‌ అర్జున్, కంగన, గూడూరు నారాయణ రెడ్డి, యాటా సత్యనారాయణ

బాబీ సింహా, వేదిక, మకరంద్‌ దేశ్‌పాండే, రాజ్‌ అర్జున్, అనుష్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘రజాకార్‌’. ‘సైలెంట్‌ జెనొసైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ (హైదరాబాద్‌లో జరిగిన నిశ్శబ్ద మారణహోమం) అనేది ట్యాగ్‌లైన్‌. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మార్చి 1న విడుదల కానుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం పాలన, సామాన్య ప్రజలపై రజాకార్ల క్రూరమైన చర్యలు, నిజాం పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేలా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన వ్యూహాత్మక ప్రయత్నాలు వంటి అంశాల నేపథ్యంతో ‘రజాకార్‌’ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా హిందీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ శనివారం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి–దర్శక–నిర్మాత కంగనా రనౌత్‌ మాట్లాడుతూ– ‘‘రజాకార్‌’ సినిమా పట్ల చిత్ర యూనిట్‌ చూపిస్తున్న అంకితభావం, తపన నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అన్నారు. ‘‘చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన ఓ అధ్యాయాన్ని ‘రజాకార్‌’ సినిమాగా తీశాం. 15 ఆగస్టు 1947–17 సెప్టెంబరు 1948ల మధ్య నిజాం పాలనలో ఏం జరిగింది? అనే అంశాలు ఈ తరం యువతీ యువకులకు తెలియాల్సిన అవసరం ఉంది’’ అన్నారు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. ‘‘నిరంకుశత్వం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వారి పరాక్రమాన్ని ఈ సినిమాలో వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు యాటా సత్య నారాయణ.

Advertisement
 
Advertisement
Advertisement