
బాలీవుడ్ నటులు ఒక్కో సినిమాకు దాదాపు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్లోనూ కొందరు స్టార్స్ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి లిస్ట్లో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా చేరిపోయారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం.
ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్ శివారులో మూడు అపార్ట్మెంట్లను ఆయన లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. వాటి ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.4.30 కోట్ల వరకు అర్జించనున్నారు. తాను లీజ్ తీసుకున్న మూడు అపార్ట్మెంట్లలో నెలవారీ అద్దె రూ. 6.30 లక్షలుగా ఉన్నట్లు టాక్. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.4 కోట్లకు పైగా సంపాందించనున్నారు జాన్ అబ్రహం. ఈ డీల్ను గత నెలలోనే క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు ఫ్లాట్లకు కలిపి రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించారు.
ప్రధానంగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు.
ఇక జాన్ అబ్రహం సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ది డిప్లొమాట్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నటించిన టెహ్రాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలో నటించింది.