తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 21 నుంచి జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా ప్రకటించింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషించారు.
పలుమార్లు వాయిదా..
సెన్సార్ సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం చివరకు జులై 23న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత విడుదలైన చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి విజయవంతంగా ప్రదర్శితమైంది.
కథేంటంటే..
దళపతి వెట్రి కొండన్(విజయ్) పోలీసు ఆఫీసర్. ఓ నేరం కింద ఆయన మధురై సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. కొత్తగా వచ్చిన జైలు వార్డెన్(గౌతమ్ వాసుదేవ్ మీనన్),దళపతి మంచి తనం చూసి.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి(రేవతి)ని చివరి సారిగా చూసేందుకు అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి విడుదలయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలో జైలు జైలర్ కూతురు విజ్జి(మమితా బైజు)తో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదంలో జైలర్ చనిపోవడంతో విజ్జికి అన్ని తానై చూసుకుంటాడు.
తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో జాయిన్ చేయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే విజ్జికి ఫియర్ ఫోబియా ఉండడంతో.. ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకొని సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అలాంటి విజ్జిని ఓ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తుంది. దీని వెనుక గ్యాంగ్స్టర్ హిమ్లర్(బాబీ డియోల్) ఉన్నాడని దళపతి తెలుసుకుంటాడు. అసలు హిమ్లర్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని మనుషులు విజ్జిని ఎందుకు టార్గెట్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదీ చదవండి: ముంబై అండర్వరల్డ్ కథతో ఆర్జీవీ.. సరికొత్త ప్రయోగం


