Interesting Facts About Adipurush Movie: Director Om Raut - Sakshi
Sakshi News home page

Om Raut: రెండు సినిమాల అనుభవంతోనే ‘ఆదిపురుష్‌’.. ఓంరౌత్‌ అతిపెద్ద సాహసం!

Jun 14 2023 1:30 PM | Updated on Jun 14 2023 1:58 PM

Interesting Facts About Adipurush Movie Director Om Raut - Sakshi

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్‌ భారత్‌ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో (జూన్‌ 16) ప్రేక్షకులముందుకు రానుంది. ప్రస్తుతం నెట్టింట ఆదిపురుష్‌ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాను తెరకెక్కించిన ఓంరౌత్‌ గురించి తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఆరా తీస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. 

ఇతిహాసాలను, పురాణ గాథలను సినిమాగా మలచడం దర్శకుడికి కత్తిమీద సాములాంటిదే. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు.. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. అందుకే ఇలాంటి సబ్జెక్టులను టచ్‌ చేసేందుకు దర్శకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు మాత్రమే ఇలాంటి చిత్రాలను తెరకెక్కిసారు. కానీ ఆదిపురుష్‌ను తెరకెక్కించిన డైరెక్టర్‌కి ఎక్కువ అనుభవం ఉందనుకుంటే పొరపాటే. కేవలం రెండు సినిమాల అనుభవంతోనే రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ‘ఆదిపురుష్‌’ని తెరకెక్కించాడు. 

ముంబైలో పుట్టి పెరిగిన ఓంరౌత్‌.. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన తర్వాత సీనీ రంగంలోకి అడుగుపెట్టాడు. తన తాత జేఎస్‌ బాండేకర్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌, ఎడిటర్‌ కావడంతో ఓంరౌత్‌కు చిత్ర పరిశ్రమపై ఇష్టం పెరిగింది. ఇందుకోసం  ఉన్నత విద్య పూర్తయిన తర్వాత న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సీటీలో సినిమాలకు సంబంధించిన కోర్సులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. రైటర్‌గా, డెరెక్టర్‌గా ఎమ్‌టీవీ నెట్‌వర్క్‌లో కొన్నాళ్ల పాటు పని చేశాడు. ‘సిటీ ఆఫ్‌ గోల్డ్‌’, హాంటెడ్‌-3డీ’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. 

మరాఠీ చిత్రం లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్ (2015)తో దర్శకుడిగా మారాడు. తొలి సినిమానే దర్శకుడిగా ఓంరౌత్‌కు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుని తెచ్చిపెట్టింది.  ఓంరౌత్‌  దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘తాన్హాజీ’(2020). పిరియాడికల్‌ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓంరౌత్‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక మూడో చిత్రమే పాన్‌ ఇండియాస్టార్‌ ప్రభాస్‌తో ప్లాన్‌ చేశాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ఓంరౌత్‌కు ఎలాంటి అవార్డులను తెచ్చిపెడుతుందో చూడాలి.

(చదవండి: ఆ ప్లేస్‌లో ప్రభాస్‌ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement