పొల్లాచ్చి వెళ్లింది చిరంజీవి అండ్ టీమ్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ యువ హీరోయిన్ అనశ్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ కాలేజీలో జరిగింది.
చిరంజీవి–అనశ్వరల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘దర్శకుడు బాబీ ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
ఇందుకోసం ఆయన ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రం ప్రధాన కథాంశం కోల్కతా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో చిరంజీవి గ్యాంగ్స్టర్గా కనిపిస్తారని సమాచారం. అలాగే తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ఈ సినిమా కథకు కీలకమని, చిరంజీవి–అనశ్వర తండ్రీ కూతుళ్లుగా కనిపిస్తారని తెలిసింది. కెవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్ .ఎస్.


