
మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కన్నప్ప'కు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హర్డ్డిస్క్ మాయం కావడంతో మూవీ టీమ్ తీవ్ర ఆందోళన చెందింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా 'కన్నప్ప' మీద బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. తమ వర్గాన్ని కించపరిచేలా ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయిని వారు ఆరోపిస్తున్నారు.
కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, గుంటూరులో నేడు (శనివారం) జరగనున్న కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ వివాదం గురించి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటాం.' అని శ్రీధర్ హెచ్చరించారు.
ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించారు.