బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్బాస్’ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల రిలీజ్ చేసి, ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తారని అధికారికంగా ప్రకటించారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సీజన్ని ప్లాన్ చేశారట మేకర్స్. దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్స్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అందులో దాదాపు సగం మంది అంటే 10 మంది వరకు కామనర్సే ఉండే అవకాశం ఉంది. గత సీజన్లలో కామరన్స్ తమదైన ఆటతో అదరగొట్టేశారు. సీజన్ 9కి విజేతగా నిలిచిన కల్యాణ్ కూడా కామనర్స్ కేటగిరీ నుంచి వచ్చినవాడు. అందుకే 10వ సీజన్లో ఎక్కువ మంది కామనర్స్ని తీసుకోవాలని చూస్తున్నారట. సామాన్యులను సెలక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయట. ఇవన్నీ పరిశీలించి.. అందులో నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి అగ్ని పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జులై 25 నుంచి అగ్ని పరీక్ష 2ని టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్బాస్ 10వ సీజన్ ప్రారంభం కానుంది.
ఇక ఈ సీజన్లో పాల్గొనే సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి 10 మంది సెలెబ్రిటీలను బిగ్బాస్ హౌస్లోకి పంపించే అవకాశం ఉంది. వారిలో బుల్లితెర నటి పల్లవి గౌడ, రాకింగ్ రాకేష్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ పవిత్ర , నూకరాజు, ప్రభాకర్ లేదా ఆయన కొడుకు చంద్రహాసన్, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, రచయిత కడలి సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ లిస్ట్లోకి సింగర్ మంగ్లీ కూడా వచ్చి చేరింది. ఇటీవల ఈ ఫోక్ సింగర్ వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ, అధిక వడ్డీ పేరుతో చేసిన ఘరానా మోసాల వంటి కేసుల విషయాల్లో వార్తల్లో నిలిచిన మంగ్లీ.. సీజన్ 10లో పాల్గొని..తనపై వచ్చిన నెగెటివిటీని పొగొట్టుకోవాలని ప్రయత్నిస్తుందట. గతంలోనూ ఆమెకు బిగ్బాస్ ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు తనకు ఆసక్తి లేదని చెప్పిందట. ఈ సారి మాత్రం పాల్గొనే అవకాశం ఉంది.


