
ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర(74) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన..సికింద్రాబాద్ మదర్ థెరిసా రీహబిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.వరంగల్ జిల్లాకు చెందిన రంగయ్య, సోమలక్ష్మీ దంపతులకు చంద్రశేఖర్ ఆగస్ట్ 28, 1946లో జన్మించారు. సర్వశ్రీ శేషగిరిరావు, బాపు, సత్యమూర్తి స్ఫూర్తితో ఆయన చిత్రలేఖనం వైపు అడుగులు వేశారు. యుక్తవయసు నుండే రేఖా చిత్రాలు గీయడం ప్రారంభించారు. బాపు తర్వాత ఆ స్థాయిలో విరివిగా వార, మాస పత్రికలకు బొమ్మలు గీసిన ఖ్యాతి చంద్రకే దక్కుతుంది.
నాలుగు దశాబ్దాల పాటు నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్స్, రంగుల్లో బొమ్మలు, కార్లూన్లు, పెయింటింగ్స్, గ్రీటింగ్ కార్డులు, లోగోలు గీసిన చంద్రకు దేశ విదేశాలలో కోట్లాది మంది అభిమానులు వున్నారు. వేల సంఖ్యలో నవలలకు కవర్ పేజీలు వేశారు. దశాబ్దాల పాటు వార ప్రతికలకు పండగ సమయాల్లో కవర్ పేజీలు గీశారు. చంద్రకు భార్య భార్గవితో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చంద్ర మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.