
హైదరాబాద్లో ప్రతీ ఏడాది నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దసరా మరుసటిరోజున ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున, బ్రహ్మానందం పలు వ్యాఖ్యలు చేశారు.
కులమతాలకు అతీతంగా, పార్టీలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగలా ఈ వేడుక జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం సుమారు 20 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు రెడీ చేశారు.
సపోర్ట్గా నిలబడతారనే నమ్మకం కలిగింది: నాగార్జున
అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ దత్తాత్రేయ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున పలు వ్యాఖ్యలు చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని సత్కారం చేయడం కొత్తగా అనిపించిందని ఆయన చెప్పారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ఒకే వేదికపై రావడం అందరిలో కాన్ఫిడెన్స్ పెంచిందని తెలిపారు. ఏదైనా ఇష్యూ వస్తే సపోర్ట్గా నిలబడతారని నమ్మకం కుదిరిందని నాగార్జున్ చెప్పుకొచ్చారు. ఇదే కార్యక్రమంలో పాల్గగొన్న బ్రహ్మానందం ఇలా అన్నారు. 'అలయ్ బలయ్ ఆలింగనం చేసుకునే కార్యక్రమం. శ్రీరామ చంద్రుడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి అలయ్ బలయ్ ఉంది. శాంతి నశిస్తున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం.' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్, అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మందకృష్ణ మాదిగ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.