పరారీలో సినీ నటి కస్తూరి.. సమన్లు జారీ చేసిన పోలీసులు | Actress Kasthuri Is Absconding Police Has Issued Summons | Sakshi
Sakshi News home page

పరారీలో సినీ నటి కస్తూరి.. సమన్లు జారీ చేసిన పోలీసులు

Nov 10 2024 12:22 PM | Updated on Nov 10 2024 6:59 PM

Actress Kasthuri Is Absconding Police Has Issued Summons

చెన్నైలో నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెబుతూనే క్షమాపణ కూడా కస్తూరి చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్‌ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్‌ చేస్తున్నారని కూడా ఆమె చెప్పింది.

కస్తూరి చేసిన వ్యాఖ్యలతో చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోన్‌ కూడా ఆఫ్‌ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ.. నటి కస్తూరి తెలుగువారిపై ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్‌ చేసింది. అలా అయితే,  ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్‌ చేస్తున్నారని ఆమె ఆరోపించింది.

Advertisement
 
Advertisement
Advertisement