ఆ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌: షాకింగ్‌ లుక్‌లో జయసుధ!

Actress Jayasudha Latest Grey Hair Look Goes Viral On Social Media - Sakshi

పద్నాగేళ్ల వయసులో స్క్రీన్‌పై కనిపించి, ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 45 ఏళ్లకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్‌’  తర్వాత జయసుధ పెద్ద సినిమాల్లో కనిపించలేదు. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చారామె. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం కానున్న సీరియల్‌ ‘జానకి కలగనలేదు’ బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ సందేశం విడుదల చేశారు. 

తాను, శోభన్‌బాబు కలిసి నటించిన ‘జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’ పాట అప్పట్లో ప్రభంజనం సృష్టించిన విషయాన్ని జయసుధ గుర్తుచేసుకున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను అన్నిచోట్లా మారుమోగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ హిట్‌ సాంగ్‌ను ఊటీలో షూట్‌ చేశామని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆ పాట పేరుతో సీరియల్‌ రావడం సంతోషంగా ఉందని, ధారావాహిక పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షించారు. చాలా రోజుల తర్వాత జయసుధను చూడటం సంతోషంగానే ఉన్నప్పటికీ, ఆమె లుక్‌ చూసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

తాజా వీడియోలో ఆరెంజ్‌ కలర్‌ నెక్‌ టీషర్ట్‌ ధరించిన జయసుధ నెరిసిన జుట్టుతో కనిపించారు. ముఖంలో మునుపటి కళ లేదు. పూర్తిగా  పాలిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో సహజనటికి అనారోగ్య సమస్యలేవైనా ఉన్నాయా లేదా షూటింగ్‌ లేనందు వల్లే ఇంట్లో ఇలా నార్మల్‌ లుక్‌తో ఉన్నారా అన్న విషయం అర్థం కాక ఫ్యాన్స్‌ గందరగోళంలో పడిపోయారు. కాగా జయసుధగా ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకున్న సహజనటి అసలు పేరు సుజాత. ఆమె భర్త నితిన్‌ కపూర్‌ 2017లో మరణించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు నిహార్ వివాహం గతేడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

చదవండి: ‘బేబమ్మ’.. చిన్నప్పటి యాడ్స్‌ చూశారా?

 స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top