‘‘జీవితంలో ఎన్నో కలలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ, ఒక గొప్ప విజన్ను ఆచరణలోకి తీసుకురావాలంటే దాన్ని నమ్మే నిర్మాత అవసరం. మా నిర్మాత కిషోర్గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ‘నాగబంధం’ సినిమా కోసం ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది’’ అని డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది.
శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రదర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కూడా మన తెలుగు సాంకేతిక నిపుణులు రూపొందించినవే కావడం నాకు మరింత గర్వంగా ఉంది. విజువల్గా, సాంకేతికంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.
విరాట్ కర్ణ మాట్లాడుతూ– ‘‘మన పురాతన ఆలయాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చరిత్రను తర్వాతి తరాలకు తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మన సనాతన ధర్మం, చారిత్రక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం ‘నాగబంధం’. ఇలాంటి ఎపిక్ కథలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేష్.
‘‘మేమంతా అభిషేక్గారి విజన్ను నమ్మి ఈ ప్రయాణంలో భాగమయ్యాం’’ అని ఐశ్వర్యా మీనన్ పేర్కొన్నారు. కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగబంధం’ కోసం అందరూ ఎంతో అంకితభావంతో పని చేశారు. ఆ మ్యాజిక్ను జూలై 3న ప్రేక్షకులు థియేటర్లలో చూస్తారు’’ అని తెలి΄ారు. ‘‘ఈ సినిమా మొత్తం ప్రయాణంలో దైవానుగ్రహం మాకు అండగా నిలిచింది. ఎన్ని సవాళ్లు వచ్చినా షూటింగ్ ఆగలేదు’’ అని నిషిత నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సంగీత దర్శకులు అబి–జునైద్, కెమెరామేన్ సౌందర్ రాజన్ మాట్లాడారు.


