ట్రిపుల్‌ఆర్‌ పక్కనే కూ.. చుక్‌చుక్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఆర్‌ పక్కనే కూ.. చుక్‌చుక్‌

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

ఔటర్‌ రింగు రైలు

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి

పూర్వవైభవం

హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రైల్‌ ప్రాజెక్ట్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ త్వరలో ప్రారంభించనున్న ట్రిపుల్‌ఆర్‌ (రీజినల్‌ రింగు రోడ్డు)కు 3.5నుంచి 11కిలోమీటర్ల దూరంలో రింగు రైల్‌ మార్గం నిర్మాణం చేపట్టాలని ముందుగా అనుకున్నారు. కానీ తాజాగా డీపీఆర్‌లో మార్పులు చేసి ట్రిపుల్‌ఆర్‌కు కొద్ది దూరంలోనే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లాకు కలిసి రానుంది. – గజ్వేల్‌

ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైన వేళ.. మరో భారీ అభివృద్ధి ప్రాజెక్ట్‌ ఔటర్‌ రింగ్‌ రైలు వ్యవహారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్‌ జిల్లా (సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి)తోపాటు వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా రింగు రైలు అలైన్‌మెంట్‌ ఖరారైంది. ముందుగా ట్రిపుల్‌ఆర్‌ (రీజినల్‌ రింగు రోడ్డు)కు సమాంతరంగా చాలా చోట్ల 3.5కిలోమీటర్ల దూరంలో, ఒకటి రెండు చోట్ల మాత్రం 11కిలోమీటర్ల దూరంలో అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. కానీ నేడు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి ట్రిపుల్‌ఆర్‌ పక్కనే అంటే.. కొద్ది దూరంలోనే ఔటర్‌ రింగు రైలు నిర్మాణం చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ (డీటేయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపొర్ట్‌)కు కేంద్రం ఆమోదం పలికినట్లు వార్తలొస్తున్నాయి. అలైన్‌మెంట్‌ మారటం వల్ల గతంలో మాదిరిగా కాకుండా ట్రిపుల్‌ఆర్‌కు దగ్గరగా, సమాంతరంగా ఔటర్‌ రింగు రైలు వెళ్లనుండటం అన్ని రకాలుగా కలిసి రానుంది. ఈ రెండు ప్రధాన భారీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు పక్కనే పక్కనే ఉండటం ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుంది.

రవాణా ఆధారిత వాణిజ్యానికి ఊతం

ఈ భారీ ప్రాజెక్ట్‌ వల్ల ఉమ్మడి మెదక్‌ జిల్లాకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రధానంగా రవాణా ఆధారిత వాణిజ్యం అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటం వల్ల ట్రిపుల్‌ఆర్‌తోపాటు ఔటర్‌ రింగు రైలుతో ఈ ప్రాంతంలో వాణిజ్య, వ్యాపార రంగాలు భారీగా విస్తరించనున్నాయి. కాగా అవుటర్‌ రింగు రైలు ప్రాజెక్టులో భాగంగా ఆరు చోట్ల ఆర్‌ఓఆర్‌(రైల్‌ ఓవర్‌ రైల్‌) వంతెనలు రానున్నాయి. ఈ ఆర్‌ఓఆర్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని గజ్వేల్‌లో రానుందని ప్రకటనలు వెలువడ్డాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జగదేవ్‌పూర్‌, గజ్వేల్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా ఈ రింగు రైలు 120 కిలోమీటర్లపైనే విస్తరించే అవకాశాలున్నాయి.

గతంలో చేసిన అలైన్‌మెంట్‌లో మార్పులు

డీపీఆర్‌కు కేంద్రం ఆమోద ముద్ర!

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు భారీ ప్రయోజనం

రవాణా ఆధారిత వాణిజ్యం విస్తరణకు అవకాశం

ట్రిపుల్‌ఆర్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతుండటం, ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు సిద్ధం కావడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుందనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో వేగంగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బడా పెట్టుబడుదారులు ఈ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement