ఎంఈఓల నియామకం
పాపన్నపేట(మెదక్): సర్కార్ బడులపై పర్యవేక్షణ పెంచి, బాధ్యతల భారాన్ని తగ్గించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతుంది. ఈమేరకు పలువురు ఉన్నతాధికారులతో కూ డిన కమిటీని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓగా రెండో పోస్టు మంజూరు, ఆర్థిక పరమైన ప్రభావం, ఇద్దరు నిర్వర్తించాల్సిన విధులు తదితర అంఽశాలను పరిశీలించి, 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే, జిల్లాకు మరో 21 మంది ఎంఈఓలు కొత్తగా రానున్నారు.
అంతా ఇన్చార్జిలే..
జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 903 సర్కారు బడులు ఉండగా, 73,476 విద్యార్థులు చదువుతున్నారు. అయితే అన్ని మండలాల్లోనూ ఎంఈఓలు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మండలంలోని సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వీరు రెండు పడవల మీద ప్రయాణం చేస్తుండటంతో, ఏ బాధ్యత కూడా పూర్తిగా నిర్వహించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో మండలంలో 40 నుంచి 55 పాఠశాలల వరకు ఉన్నాయి. నెలలో కనీసం రోజుకో పాఠశాలను కూడా తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది. ఇద్దరు ఎంఈఓల నియామకంతో ఒకరికి బోధన, సిలబస్ బాధ్యతలు, మరొకరికి బోధనేతర కార్యక్రమాలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
పరస్పర సహకారం కోసం
సమీపంలోని సుమారు 10 నుంచి 15 పాఠశాలలను కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు 2011లో జిల్లాలో 61 కాంప్లెక్స్లు ఏర్పాటయ్యాయి. సంబంధిత పాఠశాలల్లో ఉన్న టీచర్లు, బోధనోపకరణాలు, పుస్తకాలు, ఆట వస్తువులు, ల్యాబ్లు, మైదానాలను పరస్పర ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని నాణ్యమైన విద్య అందించాలన్నది దీని లక్ష్యం. దీంతో ఎంఈఓల బాధ్యతలు కూడా కొన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బదలాయించబడ్డాయి. నెలకో సారి ఉపాధ్యాయులలో వృత్తిపరమైన నూతన విధానాలు, ఆలోచనలు పంచుకునేందుకు, బోధనను మెరుగుపరుచుకునేందుకు కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
విధి విధానాల రూపకల్పనకు కమిటీ
జిల్లాలో 21 మండలాలు, 61 స్కూల్ కాంప్లెక్స్లు
903 పాఠశాలలు, 73,476 మంది విద్యార్థులు


