సంగారెడ్డి: చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు మంత్రి దామోదర రాజనర్సింహకు శనివారం సంగారెడ్డిలో వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన జలాలను సరిగ్గా శుద్ధి చేయకుండానే పైపుల ద్వారా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని వారు ఆరోపించారు. వర్షాలు కురిసే సమయాన్ని ఆసరాగా చేసుకుని వ్యర్థ జలాలను నదిలోకి వదులుతున్నారని దీనివల్ల మంజీరా నది కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిపై ఆధారపడిన రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. కాలుష్యం కారణంగా చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయని, ఈ నీటిని సాగుకు వినియోగిస్తే పంటలు దెబ్బతింటాయని వివరించారు. మంజీరా నది నీటిని తాగుకు వినియోగిస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంపై విచారణ చేపట్టాలని కోరారు. నది నీటినమూనాలను సేకరించి శాసీ్త్రయ పరీక్షలు నిర్వహించాలని, కాలుష్యానికి కారణమైనవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులవినతిపై స్పందించిన మంత్రి దామోదర వ్యర్థ జలాల విడుదలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.
వైకుంఠపురంలో మంత్రి దామోదర పూజలు
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
మంత్రి దామోదరకు శివంపేట గ్రామస్తుల వినతి


