మెదక్జోన్: విద్యార్థులు మొబైల్ వ్యసనానికి దూరంగా ఉంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు ఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటిన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. జీవితంలో విజయం సాధించేందుకు ప్రతిభతోపాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో అలవర్చుకునే మంచి అలవాట్లే భవిష్యత్తుకు బాటలు వేస్తాయని చెప్పారు. తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని, అందుకు అవసరమైన విద్య, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, చదువు, భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం, ఎస్ఐలు నారాయణ, నరేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్


