నిజాంపేట(మెదక్): వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పలువరు వక్తలు పేర్కొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రామాయంపేట సీఐ సైదానాయక్ ఆధ్వర్యంలో ఆటో, స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..అతివేగం, మద్యం తాగి, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు నిలపవచ్చని తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయం చేసిన వారికి రహదారి రహవీర్ పథకంలో భాగంగా రూ.25 వేలు నగదు బహుమతిని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ను లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో నిజాంపేట ఎస్ఐ శ్రీ రాజేశ్, హెడ్ కానిస్టేబుళ్లు మురళీధర్, సునీత, రైటర్ రాజు, కానిస్టేబుళ్లు అశోక్, ఆమని, మానస తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులో వక్తలు


