న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ గడువును ఈనెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన గడువు ఈనెల 31తో ముగియగా, మరోసారి పొడిగించింది. దీంతో ప్రవేశాల సంఖ్య పెరగనుంది. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, గురుకుల, ప్రైవేట్ కళాశాలలు 100కు పైగా ఉన్నాయి. గతేడాది ప్రభుత్వ కళాశాలల్లో 4,677 మంది విద్యార్థులు ప్రవేశం పొందగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4,503 మంది ప్రవేశం పొందారు. గతేడాది కంటే ఈసారి కేవలం 174 మంది తక్కువగా చేరారు. ప్రస్తుతం ప్రవేశాల గడువు పెంచినందున మరిన్ని అడ్మిషన్లు అయ్యే అవకాశం ఉంది.
అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకులు, సిబ్బంది కళాశాలల ప్రారంభానికి ముందే మేలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లిన వారు ప్రభుత్వ కళాశాలల్లో చదవడం ద్వారా కలిగే ప్రయోజనాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉత్తమ ఫలితాలు తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను అక్కడే తాత్కాలికంగా అడ్మిషన్ సైతం చేసుకున్నారు. ఇలా సుమారు 15 రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించడంతో ప్రవేశాలు పెరిగాయి. ఈక్రమంలో మరోసారి ప్రవేశాల గడువును ప్రభుత్వం పొడిగించింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ నెల 15 వరకు గడువు పొడిగింపు


