కొల్చారం(నర్సాపూర్): ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ, ప్రభుత్వం ఆరుతడి పంటల దిశగా ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. బుధవారం చిన్నఘనాపూర్ సమీపంలోని ఘనపురం ప్రాజెక్టును సందర్శించి పొంగి పొర్లుతున్న మంజీరమ్మకు పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాలు కురవడం, మంజీరా పొంగిపొర్లడం, పంటలు సాగు చేసిన రైతులపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇప్పటికే 70 శాతం వరకు రైతులు వరి నాట్లు వేశారన్నారు. ఇప్పుడు ఆరుతడి పంటలు వేయాలంటూ అవగాహన సదస్సులు, విత్తన మేళాలు నిర్వహించడం సరికాదన్నారు. యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఒక యూరియా బస్తాకు ఒక నానో యూరియా, రెండు డీఏపీ బస్తాల ఒక నానో డీఏపీ అంటగడుతూ రైతులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచ్లు రవితేజరెడ్డి, ఆంజనేయులు, స్వామి, మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


