రామాయంపేట(మెదక్): జాతీయ రహదారిపై రామాయంపేట సమీపంలోని జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులు అంగీకరించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ తెలిపారు. ఈమేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి మంగళవారం హైదరాబాద్ వెళ్లి ఆశాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామాయంపేట, కోమటిపల్లి జంక్షన్ వద్ద బ్రిడ్జి లేకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో వాహనదారులు మృతిచెందారని అన్నారు. కోమటిపల్లి స్టేజీ వద్ద నుంచి ఆధ్యా హోటల్ వరకు కిలోమీటర్ మేర కవర్ అయ్యే విధంగా బ్రిడ్జి నిర్మించాల్సి ఉందన్నారు. రెండు జంక్షన్లను ఇప్పటికే జాతీయ రహదారుల శాఖ బ్లాక్ స్పాట్లుగా గుర్తించిందని వెల్లడించారు. ప్రతి రోజూ రెండు, మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆమె వెంట సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, కౌన్సిలర్లు చరిత, ప్రవీణ్, జిల్లా నాయకులు ఉమామహేశ్వర్, హస్నొద్దీన్తో పాటు ఇతర నాయకులు ఉన్నారు.
ఉద్యమ ఫలితమేనన్న పద్మారెడ్డి


