మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల తనిఖీకి అకాడమిక్ ప్యానల్ టీమ్స్ను నియమించింది. విద్యార్థుల చదువుస్థాయి, ఉపాధ్యాయుల బోధన విధానం, సిలబస్ పూర్తి కావడం, నోట్బుక్స్ దిద్దడంపై బృందాలు తనిఖీ చేపట్టనున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిష్టర్లు, అడ్మిషన్ రిజిష్టర్లు, నిధుల వినియోగంపై ఆరా తీస్తారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ పాటించడం, ఆహారం తినే విద్యార్థుల సంఖ్య, పారిశుద్ధ్యం నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల పరిశుభ్రత, డిజిటల్ తరగతుల నిర్వహణ, ల్యాబ్, లైబ్రరీ వసతులపై తెలుసుకుంటారు. లోపాలను గుర్తించి వాటిని సరిదిద్ధుకోవడానికి ప్రధానోపాధ్యాయులు, సిబ్బందికి సూచనలు చేస్తారు. పాఠశాలల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల సమస్యలపై అధికారులకు నివేదిస్తారు.
నైపుణ్యాలపై అంచనా..
పాఠశాలల్లో విద్యార్థుల చదువు నాణ్యత పెంచేందుకు నిర్వహించే లర్నింగ్ ఇంప్రూవ్మెంటు ప్రోగ్రాం పరిశీలించనున్నారు. బోధన తీరు, పాఠ్య ప్రణాళికతోపాటు సబ్జెక్టుల వారీగా తరగతి గదుల్లో ప్రత్యక్షంగా కూర్చుని పాఠాల బోధనను వినడం, విద్యార్థుల సబ్జెక్టు అవగాహన స్థాయి, ప్రాథమిక అక్షరాస్యతను అంచనా వేస్తారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) మిషన్ కింద విద్యార్థులకు ప్రాథమిక చదవు, రాయడం, గణిత నైపుణ్యాలు అందుతున్నాయో లేదో తనిఖీ చేస్తారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించే విధానం, ప్లానింగ్, అభ్యసన సామగ్రి(టీఎల్ఎం)ను పరిశీలిస్తారు. తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రగతి అంచనా వేస్తారు. తనిఖీ పూర్తయిన తర్వాత ఎంఈవో, డీఈవోలకు నివేదిక అందజేస్తారు.


