మంచిర్యాలక్రైం: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించి నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులు, ఎస్హెచ్ఓలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుల అరెస్ట్లో జాప్యం చేయొద్దని అన్నారు. ఆర్థిక నేరాల్లో ఆస్తుల గుర్తింపు స్వాధీనం, జప్తుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున నిర్లక్ష్యానికి తావివ్వొద్దని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, రామ్రెడ్డి, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, ప్రవీణ్కుమార్, రవీందర్ పాల్గొన్నారు.
పోలీసు వాహనాల తనిఖీ
మంచిర్యాలక్రైం: పోలీసు అధికారులు వినియోగించే వాహనాలను కమిషనరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించి తనిఖీ చేశారు. వాహనాల్లో ప్రథమ చికిత్స పెట్టె, అత్యవసర దీపం, తాళ్లు, ట్రాఫిక్ కోన్లు, భద్రత జాకెట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అనంతరం డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.


