జైపూర్: మండలంలోని వివిధ గ్రామాల్లో వాగులపై వంతెనల నిర్మాణానికి ఎట్టకేలకు ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో ఆయా గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. హైదరాబాద్ రాజీవ్ రహదారి నుంచి టేకుమట్ల క్రాస్ రోడ్డు ద్వారా ఇందారం, టేకుమట్ల, షెట్పల్లి మీదుగా కుందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్, శివ్వారంతో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా టేకుమట్ల పెద్ద వాగు, కుందారం, కిష్టాపూర్ వద్ద ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ వంతెనలపై వర్షాకాలం వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఎట్టకేలకు మూడు వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11కోట్లు మంజూరు చేసింది. దీంతో దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న బ్రిడ్జిల నిర్మాణ కల సాకారం కానుంది. 15 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పడడంతో పాటు వర్షాకాలం వరద కష్టాలు తొలగనున్నాయి.
రవాణా సౌకర్యం మెరుగు..
జైపూర్ మండలంలోని టేకుమట్ల క్రాస్ రోడ్డు మీదుగా షెట్పల్లి నుంచి శివ్వారం రోడ్డు మార్గంలో మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్కు నిత్యం రాకపోకలు రాకపోకలు సాగిస్తుంటారు. టేకుమట్ల పెద్ద వాగుపై ఏళ్ల క్రితం లోలెవల్ వంతెన నిర్మించారు. కాలక్రమేనా రోడ్డు ఎత్తుకావడం బ్రిడ్జి కిందకు ఉండడంతో భారీ వర్షాలకు వాగు ఉపొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇదేమార్గంలో కుందారం సమీపంలో చిన్నకల్వర్టు, కిష్టాపూర్ వద్ద మరో కల్వర్టు నిర్మించారు. చిన్నపాటి వర్షానికి వరద నీరు వాటిపై నుంచి ప్రవహించడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. మూడు చోట్ల వంతెనల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగు పడనుంది.


