తలసేమియా, సికిల్సెల్ బాధితులకు పింఛన్
పంద్రాగస్టు నుంచి అమలుకు ప్రకటన
ఉమ్మడి జిల్లాలో 1,500లకు పైగా బాధితులు
మంచిర్యాలటౌన్: తలసేమియా, సికిల్సెల్ ప్రాణా ంతక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ‘చేయూత’ అందించనుంది. బాధితులు ప్రతీ పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించుకోవడంతోపాటు ప్రతీరోజు మందులు వాడాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 మందికిపైగా బాధితులు ఉండగా.. మంచి ర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఆదిలాబాద్లోని రిమ్స్లో ఉచితంగా రక్తం ఎక్కిస్తారు. ఈ వ్యాధుల బారిన పడిన వారిని కాపాడేందుకు రక్తంతోపాటు మందులు అత్యవసరం. ప్రతీ నెల ఒక్కో వ్యాధిగ్రస్తుడికి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. తమను దివ్యాంగులుగా గుర్తించి పింఛన్లు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తలసేమియా, సికిల్సెల్, హిమోఫీలియా వ్యాధులను దివ్యాంగుల జాబితాలో చేర్చి సదరం ద్వారా సర్టిఫికెట్లు ఇస్తుండగా.. పింఛన్లపై ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ప్రకటన వెలువడింది. దీంతో బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటి కే ఉమ్మడి జిల్లాలో వ్యాధిబారిన పడిన వారు చికిత్స పొందుతుండగా.. సదరం ద్వారా దివ్యాంగుల ధ్రు వీకరణ పత్రం పొందిన వారు కొందరే ఉన్నారు. సరైన అవగాహన లేక ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం పింఛన్ ప్రకటనతో సదరం శిబిరాలు ఏర్పాటు చేసి త్వరగా ధ్రు వీకరణ పత్రాలు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో 600 మందికిపైగా బాధితులు ఉండగా, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం పొందిన వారిలో తలసేమియా వ్యాధి గ్రస్తులు 11మంది, సికిల్సెల్ 215, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులు 11 మంది మాత్రమే ఉన్నారు.


