మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్ట్ను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం సందర్శించారు. ఆయన వెంట సమాచార, సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి, ఎస్సీ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్కుమార్ఠాకూర్ ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను సందర్శించి నీటిమట్టం వివరాలు తెలుసుకుని గేట్ల ఎత్తివేత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ దిగువ ప్రాంతంలో ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా పరిస్థితులు సమీక్షించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోందని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. నీటిమట్టం, పనితీరు, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.
మంత్రులకు ఘనస్వాగతం
మంచిర్యాల జిల్లాకు విచ్చేసిన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబులకు జిల్లా కలెక్టర్ కుమార్దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.


