కాసిపేట: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పల్లంగూడ గ్రామ పంచాయతీలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుస్స విజయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుకుమారి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి విక్రమ్రావు, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రత్నం ప్రదీప్, ఉపసర్పంచ్ శేఖర్, పాల్గొన్నారు.
సర్పంచ్, వార్డు సభ్యుల నిరసన
కాసిపేట: మండలంలోని మల్కెపల్లి గ్రామ పంచాయతీ నూతన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వినోద్ తీరును నిరసిస్తూ సర్పంచ్ కొట్నాక రఘు, వార్డు సభ్యులు నిరసన తెలిపారు. ఎన్నోసార్లు క్యాంపు కార్యాలయంలో కలిసి ప్రారంభానికి రావా లని కోరినా స్పందించని ఎమ్మెల్యే పక్కనే ఉన్న పల్లంగూడ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి వెళ్లడం తమ పంచాయతీ ప్రజలను అవమానించడమేనని తెలిపారు. ఉపసర్పంచ్ జంజిరాల సందీప్, వార్డు సభ్యులు పార్వతిబాయి, ప్రేమలత, అనూష, ప్రవీణ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సర్పంచ్ సొంత పార్టీ అయినా ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు వర్గం కావడంతో ప్రారంభోత్సవం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.


