● విత్తనాలు, ఎరువులు అందించాలి ● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
మంచిర్యాలఅగ్రికల్చర్: లోటు వర్షపాతం నెలకొన్న నేపథ్యంలో పంటల మార్పిడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులతో వాతావరణ మార్పులు, సాగు, విద్యారంగ అభివృద్ధి, తాగునీరు తదితర అంశాలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, పురోగతిని సమీక్షిస్తూ లక్ష్యసాధనకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, వ్యవసాయ అధికారి సురేఖ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నరేందర్రాథోడ్, డీపీవో వెంకటేశ్వర్రావు, సీపీవో, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


