వచ్చే నెల ఒకటి నుంచి అమలు
పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన రెండు జిల్లాల్లో సక్సెస్
చిన్నారులకు మరింతగా అందనున్న పౌష్టికాహారం
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం తొలిముద్ద(బ్రేక్ఫాస్ట్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా విజయవంతమైంది. దీంతో వచ్చే నెల ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు అధిగమించేందుకు పలు పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది. మూడేళ్ల వరకు చిన్నారుల ఇంటికే కోడిగుడ్లు, పౌష్టికాహారం పంపిస్తున్నారు. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకుని వారికి మధ్యాహ్నం పప్పు, ఆకుకూరలు, ఉడికించిన కోడిగుడ్డుతో ఆహారం అందిస్తున్నారు. సాయంత్రం స్నాక్స్ ఇస్తూ ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేషన్ డే వంటివి చేపట్టి ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులను స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించే కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా ప్రవేశ పెట్టే బ్రేక్ఫాస్ట్ పథకంతో చిన్నారులకు మరింతగా పౌష్టికాహారం అందడంతోపాటు ప్రతీరోజు చిన్నారులు కేంద్రాలకు వచ్చేందుకు దోహదపడనుంది.
జిల్లా వివరాలు
ప్రాజెక్టు అంగన్వాడీ చిన్నారులు గర్భిణులు బాలింతలు
కేంద్రాలు
మంచిర్యాల 244 2,406 1,110 839
లక్సెట్టిపేట 203 2,165 642 502
చెన్నూరు 245 2,976 901 764
బెల్లంపల్లి 283 2,974 996 856
మొత్తం 975 10,521 3,649 2,961


