బెల్లంపల్లి: ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం ప్రతికూల పరిస్థితులు కల్పిస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండడంతో పంటల సాగుకు రైతాంగం తటపటాయిస్తోంది. వర్షాలు కురుస్తాయో లేదోనని ఆందోళ న చెందుతోంది. అదును దాటిన తర్వాత వర్షాలు కురిసినా ఉపయోగం ఉండదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో రైతులు అనుకూలమైన ఆరుతడి పంటలు సాగు చేయడం అన్నింటికన్నా మేలు. కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ తదితర రకాల పంటలు సాగు చేయవచ్చని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.మహేష్ వివరించారు. ఆరుతండి పంటల ఎంపిక, అధిక దిగుబడి సాధించే తీరు, ఎరువుల వినియోగం, యాజమాన్య పద్ధతులను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
నేటికీ లోటు వర్షపాతమే..
ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర రోజులు గడుస్తోంది. ఇప్పటివరకు జోరువాన కురువకపోగా వర్షాభావం వెంటాడుతోంది. ఇప్పటికే జోరుగా వర్షాలు కురువాల్సి ఉండగా నేటికీ లోటు వర్షపాతమే నమోదవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 323మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 187మిల్లీమీటర్లు మాత్రమే వర్షం కురిసింది. 42శాతం లోటు వర్షపాతం నమోదైంది. రైతులు శాసీ్త్రయ పద్ధతులు అనుసరిస్తూ ఆరుతడి పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి.
తక్కువ కాలవ్యవధి వరి రకాలు మేలు
వర్షాభావ పరిస్థితలు ప్రభావంతో చెరువులు, కుంటల కింద వరి సాగు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. వర్షాలు లేక చాలావరకు రైతులు వరి నారు పోసుకోలేదు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాల జాడ లేకుండా పోతోంది. అయినప్పటికీ బోర్లు, వ్యవసాయ బావుల ఆధారంగా కొందరు రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలిక పంట రకాలు కాకుండా స్వల్పకాలిక వ్యవధి(120 రోజుల్లోపు పంట చేతికి వచ్చే) వరి రకాలు ఎంపిక చేసుకోవడం శ్రేయస్కరం. తగినంత వర్షపాతం లేకపోతే నాట్లు వేయడంలో తొందరపడకుండా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలి.
ఎర్రకంది..
ఆరుతడి పంటల్లో ఎర్రకంది పంట ఎంతో మేలైనది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ పంట సాగు చేసుకోవచ్చు. అడపాదడపా కొద్దిపాటి వర్షం కురిసినా పంట సాగుకు ఢోకా ఉండదు. ఎర్రకందిని సాగు చేశాక వరుసల మధ్య అంతర దుక్కులు చేసి తేమను సంరక్షించాలి. పంట పుష్పించే దశలో తేమ ఒత్తిడి ఉండే 2శాతం యూరియా పిచికారీ చేయాలి.
పెసర..
వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేసే ఆరుతడి పంటల్లో పెసరపంట ఒకటి. ఈ పంట సాగుకు కనీస యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. పంట సాగు చేశాక వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే 2శాతం యూరియా పిచికారీ చేయడం వల్ల దిగుబడి మెరుగవుతుంది. పసుపు మొజాయిక్ వ్యాధి, తెల్ల దోమ ఉధృతిని క్రమం తప్పకుండా పరిశీలించాలి. యాజమాన్య పద్ధతులు అనుసరించాలి.


