గత జూన్లో ఇద్దరు బేస్క్యాంపు సిబ్బంది అడవుల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
గతేడాది మేలో జన్నారం డివిజన్లో కొత్తూరుపల్లి ఆక్రమణలు తొలగించడంలో నిర్లక్ష్యం చేశారని ఓ బీట్ ఆఫీసర్పై వేటు వేశారు.
గతేడాది జూన్లో పీసీసీఎఫ్ పర్యటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఓ ఎఫ్ఎస్వోను సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి మెమోలు ఇచ్చారు.
రెండు రోజుల క్రితం జన్నారం డివిజన్ పైడిపల్లి బీట్ పరిధిలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్తో సహా బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు.
జిల్లాలో అటవీ సిబ్బంది నిర్లక్ష్యంతో నష్టం
అధికారులే అక్రమాలకు అవకాశమిస్తున్న వైనం
అధికారులపై సస్పెన్షన్లు, మెమోలతో వేటు
జన్నారం డివిజన్లోనే అధికంగా ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవిని రక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఘటనల్లో ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. సరిగా విధులు నిర్వర్తించని వారికి మెమోలు జారీ చేస్తున్నారు. గత ఏడాదిలో జిల్లా అటవీశాఖలోని ఒక జన్నారం డివిజన్ పరిధిలోనే ఇద్దరు డీఆర్వోలు, ఒక సెక్షన్ ఆఫీసర్, ఐదుగురు బీట్ ఆఫీసర్లు సస్పెన్షన్కు గురయ్యారు. అటవీ గ్రామాల పరిధిలో ఆక్రమణలను నిరోధించకపోవడం తదితర విధుల్లో నిర్లక్ష్యం కారణంగా వేటు పడుతోంది. మరోవైపు వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. బెల్లంపల్లి, చెన్నూరు, జన్నారం డివిజన్లలో అటవీ జంతువులను వేటగాళ్లు మట్టుబెడుతూనే ఉన్నారు.
ఫిర్యాదుల పరంపర
అటవీ సంరక్షణకు కీలకమైన కింది స్థాయి సిబ్బందిలో చాలా చోట్ల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో కొందరు అధికారులు పోడు ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేయడంతో ఆక్రమణలు జరిగాయి. గృహ నిర్మాణ అవసరాల కోసం వాడుతున్న కలప జిల్లా కేంద్రంతో సహా పలు చోట్ల అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఇక నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, కాంట్రాక్టులు, కూలీలు తదితర పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జన్నారం డివిజన్లో టేకు కలప ఉన్న చోట్ల చెట్లు నరికివేతకు గురవుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వీటితోపాటు ఆక్రమణలు సైతం నిలువరించడంలోనూ విఫలం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సరిపడా సిబ్బంది లేక ఇన్చార్జి బాధ్యతలతోపాటు అదనపు పని భారంతోనూ కొందరు ఉద్యోగులు సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు రేంజర్లు, డిప్యూటీ రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. జిల్లా కేంద్రంలోనే ఉంటూ రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పని చేయలేక పైరవీలతో జిల్లా కేంద్రం సమీప ప్రాంతాల్లోనే పని చేస్తూ ఉంటున్నారు. దీంతో కొన్ని రేంజ్ల్లో పని భారం కారణంగానూ సరిగా పని చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు


