భూ వివాదంలో ఇద్దరి దారుణ హత్య.. 13 మంది నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

భూ వివాదంలో ఇద్దరి దారుణ హత్య.. 13 మంది నిందితుల అరెస్టు

Jun 29 2023 12:56 AM | Updated on Jun 29 2023 9:36 AM

అరెస్టు చూపిస్తున్న సీఐ నరేందర్‌, ఎస్సై భూమేశ్‌ - Sakshi

అరెస్టు చూపిస్తున్న సీఐ నరేందర్‌, ఎస్సై భూమేశ్‌

రెబ్బెన(ఆసిఫాబాద్‌): భూవివాదంలో ఇద్దరిని హత్య చేసిన 13 మందిని పట్టుకున్నట్లు సీఐ అల్లం నరేందర్‌, ఎస్సై భూమేష్‌ వెల్లడించాడు. వారి వివరాల ప్రకారం... గత సోమవారం జక్కులపెల్లి శివారులోని వ్యవసాయ భూమి విషయంలో మండల బక్కయ్య కుటుంబీలకు, మండల మెంగయ్య కుటుంబీలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత ఆదివారం బక్కయ్య కుటుంబ సభ్యులు అదే భూమిలో పత్తి విత్తనాలు వేశారు. విషయం తెలుసుకున్న మెంగయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కత్తులు, గొడ్డళ్లు, రాళ్లు, కారంపొడితో భూమి వద్దకు వెళ్లారు. వారి రాకకు గమనించి బక్కయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారు వెంట తెచ్చుకున్న కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయగా బక్కయ్య కుమారుడు మండల నర్సయ్యతో పాటు అతడి సోదరి గిరుగుల బక్కక్క అక్కడికక్కడే మృతి చెందారు.

మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మండల ఇందిరా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టి పరారీలోని 13మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన మూడు గొడ్డళ్లు, రెండు కత్తులు, నాలుగు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. మండల మల్లేష్‌, మండల గణేష్‌, మండల వెంకటేష్‌, గిరుగుల భీంరావు, గిరుగుల రాకేష్‌, మండల రంగక్క, గిరుగుల రజిత, మండల రజిత, మండల రుక్మ, రాటే భూమక్క, రాటే భూడయ్య, గిరుగుల దుర్గక్క, గిరుగుల సౌమ్యలను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement