● నేడు కలెక్టరేట్ వద్ద మహాధర్నా
● అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపైకి..
● పరిష్కారం అయ్యే వరకు పోరాటం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 2 వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొనేలా జేఏసీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు తదితర శాఖలను సందర్శించి ఉద్యోగులను సమీకరించారు. జిల్లాలో టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు, పెన్షనర్లు, వివిధ శాఖల ఉద్యోగులు కలిపి సుమారు 20 వేల మంది ఉన్నారు. వీరంతా ఐక్యంగా ఉద్యమించాలని జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఒకేసారి ధర్నాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి.
51 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని 2026 సెప్టెంబర్ 30లోపు అమలు చేయాలి.
పెండింగ్లో ఉన్న ఆరు డీఏ, డీఆర్లను ఏకకాలంలో విడుదల చేయాలి.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ సమస్యలను పరిష్కరించాలి.
పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.2 వేల కోట్ల నిధుల కేటాయింపును కొనసాగించాలి.
జీఓ 317 బాధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల 63 దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపాలి.
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 17 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలి.


