● ట్రాఫిక్ మళ్లింపు.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
మహబూబ్నగర్ క్రైం: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్పీ డి.జానకి నగరంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులతో సమీక్షించారు. మూడు పోలీస్స్టేషన్ల పరిధిలో ర్యాలీ మార్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ ప్రారంభం, కొనసాగుతున్న మార్గాలు, ముగింపు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే నినాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఎస్పీ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ర్యాలీ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


