గోల్‌మాల్‌..! | - | Sakshi
Sakshi News home page

గోల్‌మాల్‌..!

Aug 2 2026 1:40 AM | Updated on Aug 2 2026 1:40 AM

స్పందన లేకపోవడంతో విజి‘లెన్స్‌’.. మిల్లర్లలో వణుకు..

గడువులోగా కట్టాల్సిందే..

జిల్లా పౌరసరఫరాల శాఖలోనూ..

మూడేళ్ల తర్వాత తేల్చిచెప్పిన సర్కార్‌..

ఎక్సెస్‌.. టెండర్‌..

ఆ వెంటనే రద్దు..

రూ.1,000 కోట్ల
2022–23 యాసంగి సీఎమ్మార్‌లో మాయాజాలం

సీఎమ్మార్‌ చెల్లించని డీఫాల్టర్ల నుంచి క్రమక్రమంగా డబ్బుల వసూలుకు ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టింది. నిర్దేశిత గడువు విధిస్తూ.. ఆ లోపు చెల్లించాలని సూచించింది. తొలి గడువు ఆగస్టు 5 సమీపిస్తున్నా.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూలై చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఒక్కో మిల్లులో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం లేకపోవడంతో పాటు పలువురు మిల్లర్ల దందా వెలుగులోకి రాగా చర్చనీయాంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా గోల్‌మాల్‌ చోటుచేసుకుంది. 2022–23 యాసంగికి సంబంధించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎమ్మార్‌)లో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. మిల్లర్ల మాయాజాలం, పౌర సరఫరాల శాఖ ఉదాసీనత, పలువురు సిబ్బంది ధనదాహం వెరసి ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి సైతం అందకుండాపోయింది. ఎట్టకేలకు దృష్టి సారించిన సర్కార్‌.. విజిలెన్స్‌ తనిఖీలకు శ్రీకారం చుట్టడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. సోదాల్లో ఒక్కో మిల్లు బాగోతం వెలుగులోకి వస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు అప్పట్లో ఏం జరిగింది, ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్‌..

యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్‌ ధాన్యాన్ని ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మర ఆడించి బియ్యం ఇచ్చేలా.. లేదంటే టెండర్‌ ద్వారా ధాన్యం విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే 2022–23 యాసంగిలో ఎక్సెస్‌ ధాన్యం రావడం, అంతగా నాణ్యత లేకపోవడం (తడిసిన ధాన్యం)తో మిల్లర్లు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెండర్‌ ద్వారా వేలం వేసినా.. పలు కారణాలతో రద్దయింది. కొన్ని మిల్లులు కొంత మేర సీఎమ్మార్‌ బియ్యం పెట్టడం, వేలంలో కొంత మేర విక్రయించింది పోనూ.. 90 శాతానికి పైగా ధాన్యం ఆయా మిల్లుల వద్దే ఉన్నాయి.

జిల్లాలోని హన్వాడ మండలపరిధిలో ఉన్న ఎంఎస్‌ శ్రీలక్ష్మి బాలాజీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో జూలై 29న విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, హైదరాబాద్‌ సిటీ–2 యూనిట్‌ అధికారులు.. జిల్లా సివిల్‌ సప్లయ్‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 1,26,772 ధాన్యం బస్తాలు లేవని నిర్ధారించారు. అంతేకాదు.. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్‌ ధాన్యాన్ని అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న రెండు లారీలను మిల్లు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మిల్లర్లలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.

2022–23 యాసంగి సీఎమ్మార్‌ బకాయిలను వసూలు చేస్తున్నాం. ఆ సీజన్‌కు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 71,060 మెట్రిక్‌ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లుల్లో ఉన్నాయి. వీటి విలువ రూ.152 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే ఆయా మిల్లర్లకు నోటీసులు అందజేశాం. అందరూ నిర్దేశిత గడువులోగా కట్టాల్సిందే. లేకుంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తప్పవు. ఈ రెండు రోజుల్లో రూ.21 కోట్లు వసూలయ్యాయి. – రవినాయక్‌,

సివిల్‌ సప్లయ్‌ డీఎం, మహబూబ్‌నగర్‌

ఎక్సెస్‌ పేరిట మిల్లర్ల అక్రమాల పర్వం

టెండర్‌ రద్దుతో మిల్లుల వద్దే లక్షలాది మెట్రిక్‌ టన్నుల ధాన్యం

ప్రభుత్వానికి బియ్యం

అప్పగించకపోవడంతో పంచాయితీ

సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌..

డీఫాల్టర్లపై చర్యలకు ఆదేశాలు

విజిలెన్స్‌ తనిఖీలతో మిల్లర్లలో వణుకు.. పౌర సరఫరాల శాఖలో సైతం..

2022–23 రబీ సీఎమ్మార్‌ డబ్బులను త్వరగా చెల్లించేలా.. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చాలామంది మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడం.. మిల్లుల్లో ధాన్యం, బియ్యం లేకపోవడాన్ని ప్రభుత్వం మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సదరు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ ప్రయోగించాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. డీఫాల్టు మిల్లులకు సీఎమ్మార్‌ కేటాయింపులు చేసిన వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు విజిలెన్స్‌ ఉన్నతాధికారులు సమాయత్తమవుతుండడం జిల్లా పౌర సరఫరాల శాఖలో కలకలం సృష్టిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. ఇటీవల సర్కారు సీరియస్‌గా దృష్టి సారించింది. మిల్లర్లు బకాయి పడిన సీఎమ్మార్‌ మొత్తం అందజేయాలని, లేకుంటే తీసుకున్న ధాన్యం తిరిగి ఇవ్వాలని.. లేదంటే క్వింటాల్‌కు రూ.2,260 చొప్పున డబ్బులు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు డబ్బులు కట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో నిర్దేశిత గడువు (ఈనెల ఐదో తేదీ లోగా 50 శాతం, సెప్టెంబర్‌లో 25 శాతం, అక్టోబర్‌లో మిగిలిన 25 శాతం)లోపు చెల్లించేలా మిల్లర్లతో సంతకాలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement