మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతతను దృష్టిలో పెట్టుకొని శనివారం నుంచి ఆగస్టు 30వరకు జిల్లావ్యాప్తంగా 30–పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, నిర్వహించరాదని సూచించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, వందతులు, మత విద్వేషాలు, సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు, వీడియోలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
యూనివర్సిటీ అంతర్గత విషయాల్లో జోక్యం తగదు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బయటి వ్యక్తులు యూనివర్సిటీ అంతర్గత విషయాల్లో జోక్యం తీసుకోవడం తరగదని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. పీయూలో వారు మాట్లాడుతూ బయటి వ్యక్తులు యూనివర్సిటీ అంతర్గత విషయాలపై జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సెమినార్ నిర్వహించే అంశం పూర్తిగా యూనివర్సిటీకి సంబంధించిందని, వీసీ శ్రీనివాస్పై ఒత్తిడి చేయడం యూనివర్సిటీ స్వ యం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అన్నారు. వీసీని ఇబ్బందికరంగా మాట్లాడిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు కావలి కిషోర్, రవితేజ, మహేశ్వరి, హరికృష్ణ, సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ తెలిపారు. వీరికి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికయ్యే క్రీడాకారులు మహారాష్ట్ర షిరిడీలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి గోగేమ్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు.


