● తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైన వనపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ బృందం
● ఒకరు అక్కడికక్కడే
మృతి.. మరొకరి పరిస్థితి విషమం
● స్వల్ప గాయాలతో
మరో ముగ్గురు..
వనపర్తి టౌన్: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వనపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ బృందం.. ముందు వెళ్తున్న డీసీఎంను ఓవర్టెక్ చేయబోయి.. ప్రమాదవశాత్తు అదే వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. వనపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకల మహేష్ తన అనుచరులు చీర్ల శ్యామ్(38), జ్ఞానేశ్వర్తోపాటు మరో ముగ్గురు భరత్, భాను, అభినయ్తో కలిసి ఈ నెల 18న (శనివారం తెల్లవారుజామున) ఎర్టిగా కారులో అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లారు. గిరి ప్రదక్షిణ ముగించుకుని సోమవారం తెల్లవారుజామున మధురైకి వెళ్తుండగా తిరుచ్చి వద్ద డీసీఎంను ఓవర్టెక్ చేయబోయి.. అదే డీసీఎం ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చీర్ల శ్యామ్ అక్కడికక్కడే మృతిచెందాడు. జ్ఞానేశ్వర్కు తీవ్రగాయాలు కాగా.. మహేష్తో పాటు భరత్, భాను, అభినయ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం జ్ఞానేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా తిరుచ్చిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న బంధువులు, సన్నిహితులు వెంటనే తిరుచ్చికి బయలుదేరి వెళ్లారు. మృతి చెందిన చీర్ల శ్యామ్తో పాటు గాయాలపాలైన వారిని అక్కడి వైద్యుల సూచన మేరకు వనపర్తికి తీసుకువచ్చి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో మాజీ చైర్మన్ మహేష్ కారు నడిపినట్లు సమాచారం. ప్రమాదంలో మృతిచెందిన శ్యామ్కు భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘనటపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తదితరులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.


