పల్లెల్లో నవశకం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పల్లెల్లో నవ శకం ప్రారంభమైంది. సోమవారం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కొత్త పాలక వర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాలో మొత్తం 423 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క పంచాయతీ మినహా మిగిలిన 422 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. గ్రామాల్లో ఓ పండుగ వాతావరణంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త పాలక వర్గం సభ్యులకు అధికారులు శాలువాతో సన్మానించారు. పక్కాభవనాలు లేని గ్రామాల్లో సాదాసీదాగా ప్రమాణ స్వీకారం చేయించారు.
● ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది. పంచాయతీలకు ఇంటి పన్నులు తప్ప.. ఇతర ఆదాయ వనరులు పెద్దగా ఉండవు. కార్మికుల జీతాలు, విద్యుత్ చార్జీలు, చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజిల్, నీటి వనరుల సంరక్షణ వంటి వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. గత ప్రభుత్వ హయాంలో రైతువేదికలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను నిర్మించారు. అవసరాలకు మూలం నిధులే కావడంతో ప్రభుత్వం సరిపడా నిధులు ఇవ్వాలని కొత్త పాలకవర్గాలు కోరుతున్నాయి.
విధులు.. బాధ్యతలు
గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి.
● జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతుతో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలతో ముంచెత్తారు. గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది.
గ్రామపంచాయతీల్లో కొలువుదీరినపాలకవర్గాలు
అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాలు


