
మహబూబ్నగర్ క్రీడలు: రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో ఈనెల 9 నుంచి 11 వరకు జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ టోర్నీ పరిశీలకుడిగా (బాలికల) సీనియర్ క్రీడాకారుడు, వనపర్తి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పీఈటీ ఎండి.ఫారుఖ్ ముకర్రం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముకర్రం గతంలో పలుసార్లు రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు పరిశీలకుడితోపాటు సివిల్ సర్వీసెస్ పోటీల్లో ఇప్పటివరకు పది సార్లు రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించారు.
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ టోర్నీలో జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాలలో నేటి నుంచి ఈనెల 10 వరకు జరిగే అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హ్యాండ్బాల్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలను బుధవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ క్రీడల్లో నిరంతర సాధన చేస్తే మేటి క్రీడాకారులుగా ఎదగవచ్చని అన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్బాబు, జిల్లా హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి జియావుద్దీన్, పీఈటీలు శంకర్నాయక్, బాల్రాజు, ఆసిఫ్, జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.
జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. బుధవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 1,645 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఆవిరి రూపంలో 67, ఎడమ కాల్వకు 390, కుడి కాల్వకు 338, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 851 క్యూసెక్కులతో కలిపి మొత్తం 1,645 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం ప్రాజెక్టులో 8.126 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పీఈటీ ముకర్రం