ఓడే సీట్లు బీసీలకు.. గెలిచే సీట్లు ఓసీలకా? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఓడే సీట్లు బీసీలకు.. గెలిచే సీట్లు ఓసీలకా? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Oct 22 2023 1:39 AM | Updated on Oct 22 2023 11:52 AM

- - Sakshi

మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, మహబూబ్‌నగర్‌: బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడే సీట్లు బీసీలకు కేటాయించి.. గెలిచే సీట్లు ఓసీలకు కేటాయించిందని, ఇదేనా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం అని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. శనివారం స్థానిక ఫాంహౌస్‌లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. బీసీ ప్రధాని అని చెప్పుకొనే బీజేపీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కేటాయించడం లేదని విమర్శించారు.

80 శాతం ఉన్న బీసీలకు కేవలం రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించడమేనా బీసీలపై ఉన్న చిత్తశుద్ధి అని నిలదీశారు. బీసీల అభ్యున్నతి కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీలపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌పై చేసిన తీర్మానం మేరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిది అన్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తూ.. ప్రతిపాదిస్తే కుట్ర పూరితంగా వెనక నుంచి తిరస్కరించేలా కుట్ర చేసింది బీజేపీ కాదా అని విమర్శించారు. బీసీ ప్రధాని ఉన్నంత మాత్రాన బీసీల బతుకులు బాగుపడవని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా కృషిచేయాలన్నారు. బీసీలకు విద్యను ప్రోత్సహించేందుకు రూ.20 లక్షల నిధులు ఇస్తూ ఓవర్సీస్‌ విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, కౌన్సిలర్‌ మునీరొద్దీన్‌, రవీందర్‌రెడ్డి, రాములు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement