గూడూరు: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని ఫారెస్టు జిల్లా అధికారులు శ్రీమన్నారాయణరెడ్డి, రాజేంద్రప్రసాద్ అన్నారు. గూడూరు మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప భీమునిపాదం జలపాత ప్రాంతంతో పాటు ములుగు జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ దేవాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు అడవులు, వన్యప్రాణులు అత్యంత కీలకమన్నారు. అడవులు స్వచ్ఛమైన గాలి, నీరు, వర్షాలు, ప్రాణవాయువును అందిస్తే, వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ప్రధాన పాత్రపోషిస్తాయన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహణ కల్పించాలని, ప్రతీఒక్కరు ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచాలన్నారు. ఎవరైన వన్యప్రాణులను చంపినా, ప్రాణ హాని కల్గించినా చర్యలుంటాయన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఫారెస్టు శాఖ టెంపుల్ టూరిజం, జలపాత పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గూడూరు ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫారెస్టు జిల్లా అధికారులు
శ్రీమన్నారాయణరెడ్డి, రాజేంద్రప్రసాద్


